తిరుపతి : తిరుపతి నగరంలోని కేటీ రోడ్లో ఉన్న ఓ ప్రముఖ వెయిట్ లాస్ మరియు బ్యూటీ సంస్థపై పలువురు కస్టమర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బరువు తగ్గిస్తామని ఆకర్షణీయ ప్రకటనలతో తమను ఆకట్టుకుని, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తర్వాత సరైన సేవలు అందించలేదని, డబ్బులు తిరిగి కోరితే నిరాకరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
బాధితుల కథనం ప్రకారం, మొదట ఉచిత కన్సల్టేషన్ లేదా స్వల్ప ఫీజుతో కస్టమర్లను సంస్థలోకి ఆహ్వానించి, అనంతరం బరువు తగ్గించే ప్రత్యేక ప్యాకేజీల పేరుతో వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తగినంత నగదు లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు ఇప్పించే విధంగా ఒత్తిడి తెస్తున్నారని కొందరు బాధితులు పేర్కొన్నారు.
ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో సేవలను నిలిపివేయాలని, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరగా సంస్థ యాజమాన్యం సహకరించడం లేదని వారు ఆరోపించారు. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, డబ్బులు తిరిగి చెల్లించే విధానం లేదని చెప్పారని బాధితులు తెలిపారు.
కొంతమంది కస్టమర్లు సంస్థ ప్రచారంలో చూపిస్తున్న ఆధునిక సాంకేతిక చికిత్సలు వాస్తవంగా అందించడం లేదని, అదనపు ట్రీట్మెంట్ల పేరుతో మరింత డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. చికిత్సల ప్రభావం, భద్రతపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, స్థానికంగా పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కూడా తాను ఈ సంస్థ సేవల విషయంలో నష్టపోయినట్లు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సంస్థ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ యాజమాన్యం స్పందన అందుబాటులోకి రాలేదు. సంస్థ వివరణ లభించిన వెంటనే ప్రచురించేందుకు అవకాశం ఉందని సమాచారం.








