హైదరాబాద్ : తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో గానీ, బీఆర్ఎస్ పార్టీతో గానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ జీవితంలో ముగిసిన అధ్యాయమని, ఆ పార్టీ అనే పుస్తకాన్ని తాను ఇప్పటికే పూర్తిగా మూసివేశానని పేర్కొన్నారు.
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కవితకు, ఒకవేళ కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆమె, “ఆ అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది. జీవితంలో కొన్నిసార్లు పేజీలు తిప్పాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు పుస్తకాలనే మూసివేయాల్సి ఉంటుంది. నేను బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని ఎప్పుడో మూసివేశాను” అని వ్యాఖ్యానించారు.
గత ఏడాది సెప్టెంబర్లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె బహిరంగ ఆరోపణలు చేయడంతో పార్టీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. అనంతరం బీఆర్ఎస్తో విభేదాలు మరింత ముదిరాయి.
ఈ ఏడాది ఏప్రిల్లో కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, సామాజిక న్యాయం, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించడం వంటి అంశాలే తమ పార్టీ ప్రధాన అజెండా అని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తనకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయని కవిత ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పూర్తిగా నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ప్రాంతీయ భావజాలం నుంచి బీఆర్ఎస్ క్రమంగా దూరమవడం వల్లే ప్రజల మద్దతు కోల్పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన కవిత, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రస్తుతం ప్రజా సమస్యలపై చురుకుగా లేవని, అవి “స్లీప్ మోడ్”లోకి వెళ్లిపోయాయని విమర్శించారు.
ఇక ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసుపై కూడా ఆమె స్పందించారు. దిగువ కోర్టులో తనపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్న కవిత, ఈడీ, సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్ల వ్యవహారాన్ని పూర్తిగా న్యాయవ్యవస్థకే వదిలేస్తున్నానని తెలిపారు.
కవిత చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్తో తనకు ఇకపై ఎలాంటి రాజకీయ సంబంధం ఉండదని ఆమె స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.








