పల్నాడు: పాస్పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగానే ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సౌకర్యవంతమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్. రామ్కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ప్రజల కోసం ప్రత్యేక రిసెప్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌంటర్లు, విశాలమైన ఎయిర్కండిషన్డ్ వెయిటింగ్ హాల్, సురక్షితమైన తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
అదేవిధంగా డాక్యుమెంట్ ప్రిపరేషన్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఇతర సేవలన్నీ ఒకే కేంద్రంలో పూర్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోనే సబ్-రిజిస్ట్రార్తో పాటు సంబంధిత శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి పత్రాలను వెంటనే చట్టబద్ధంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారని చెప్పారు.
ఈ కొత్త విధానం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని జిల్లా రిజిస్ట్రార్ ఎస్. రామ్కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సేవలను మరింత సులభతరం చేసే దిశగా ఈ సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








