కాకినాడ : కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని ప్రసిద్ధ స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం 222వ సంకష్టహార చతుర్థి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు రమణరాజు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించే గోమతి చక్రాలతో శ్రీ గణపతికి విశేష అర్చనలు జరిపారు. గోమతి చక్రాలతో చేసే పూజల వల్ల ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, వాస్తుదోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తూ చతుర్థి ఉపాసకులు శతనామావళి పారాయణం నిర్వహించారు.
ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పీఠానికి చేరుకుని మాడ వీధుల్లో కాలినడకన నాలుగు దిక్కులా ప్రదక్షిణలు చేస్తూ అష్టదిక్పాలకులను ఆరాధించారు. అనంతరం సృష్టి ఆరంభంలో చతుర్థి గణపతికి తొలిపూజ చేసిన మంగళాంబిక అమ్మవారికి (వేప వృక్ష రూపం) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మానసిక ప్రశాంతత, సంకల్పబలం కోసం 36 మంది ఆరాధకులు ఉపవాస దీక్షలు ఆచరించి, పౌర్ణమి చంద్రునికి పవిత్ర చంద్రార్ఘ్యం సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో జ్వాలా తోరణాన్ని దర్శించుకుని స్వామివారికి స్వయంపాకాన్ని నివేదించారు.
జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వయంభు శ్రీ భోగి గణపతిని దర్శించుకుని అభిషేక తీర్థాన్ని స్వీకరించారు. నక్కా సత్య సతీష్ దంపతులు పీఠాన్ని సుందరంగా అలంకరించగా, మురాలశెట్టి వీర ప్రభాకరరావు–నాగమణి దంపతులు తొలిపూజ హారతిని సమర్పించారు. ఉపవాస దీక్షలు చేసిన భక్తులకు పలువురు భక్తులు పాదప్రక్షాళన చేసి పండ్లు, ఫలహారాలు, తాంబూలాలు అందజేయగా, ఉండ్రాళ్లను స్వామివారికి నివేదించి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.








