contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగరేణి మారుపేర్లు – విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం చేయండి

గోదావరిఖని : సింగరేణి సంస్థలో గత కొన్ని సంవత్సరాలుగా మారుపేర్లు (నేమ్ ట్రాన్స్‌ఫర్) మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

శుక్రవారం రామగుండం రీజియన్ ఆర్‌జీ-1 జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఎదుట బాధితులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పనిచేసిన కార్మికుల పిల్లలకు నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ, మారుపేర్లు మరియు విజిలెన్స్ కేసులను సాకుగా చూపుతూ అధికారులు ఉద్యోగాల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని వారు విమర్శించారు.

అలాగే, గుర్తింపు కార్మిక సంఘమైన ఎఐటీయూసీ ప్రతినిధులు పలుమార్లు స్ట్రక్చర్ మీటింగ్‌లలో ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసులను వెంటనే పరిష్కరించి, అర్హులైన కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :