మార్కాపురం/పి.సి.పల్లి: ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో భాగంగా పి.సి.పల్లి ఎస్ఐ బి. నరసింహారావు పెద అలవలపాడు గ్రామంలో రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎస్ఐని కలిసి గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత, యువతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సూచించారు.
పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్ఐ నరసింహారావు భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడేందుకు ‘పల్లెనిద్ర’ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








