అనకాపల్లి జిల్లా, రావికమత: రేషన్ బియ్యం కోసం కొండ దిగి వెళ్లి.. మళ్లీ కొండెక్కి రావాల్సిన పరిస్థితి అనకాపల్లి జిల్లా రావికమత మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని చల్లి సింగం గిరిజన గ్రామ ప్రజలను వేధిస్తోంది.
కొండ శిఖరంపై ఉన్న ఈ గ్రామంలో సుమారు 410 మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 150 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే గ్రామంలో రేషన్ డిపో లేకపోవడంతో కొత్తపట్నం గ్రామంలోని డిపో నుంచి బియ్యాన్ని తీసుకురావాల్సి వస్తోంది. ప్రస్తుతం రేషన్ డిపో నంబర్ 0319023 నుంచి సి.కె.పాడు వరకు బియ్యం తీసుకొచ్చి, అక్కడి నుంచి చల్లి సింగం గ్రామానికి మరో మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామానికి రహదారి నిర్మాణం కోసం ఇంపాక్ట్ నిధుల కింద పంచాయతీరాజ్ శాఖ ద్వారా GO Route No.726 ప్రకారం 2023-24 సంవత్సరంలో రూ.2.65 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నెలాఖరుకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.
అయితే రోడ్డు నిర్మాణం పూర్తయినా రేషన్ కోసం ఇబ్బందులు కొనసాగకుండా గ్రామంలోనే రేషన్ డిపో ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా.. నిత్యావసరమైన రేషన్ బియ్యం కోసం కనీసం ఒక రోజు సమయం వెచ్చించాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చల్లి సింగం గ్రామంలో తక్షణమే రేషన్ డిపో పాయింట్ ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలను తొలగించాలని గిరిజన సంఘం నాయకులు సీహెచ్. శంకర్రావు, కే. గోవిందరావు జిల్లా కలెక్టర్ను కోరారు.








