తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అవతరణ దినోత్సవం వేడుకలకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఎందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ముందుకు సాగుతోందన్నారు. మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరా మహిళా శక్తి మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులందరికీ రేషన్ కార్డులు, మైనార్టీ సంక్షేమం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, భూభారతి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వంటి పథకాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆదనపు కలెక్టర్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు








