కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 20 శాతం వడ్లు మాత్రమే మిల్లులకు తరలించగా, ఇంకా 80 శాతం వడ్లు కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయి ఉన్నాయని రైతులు వాపోయారు.
ఆరు కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయకపోవడం, లారీలు సమయానికి రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిస్తే తాము పడిన శ్రమంతా వృథా అవుతుందని ఆందోళన చెందుతూ, ప్రభుత్వానికి మరియు అధికారులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రైతులంతా ఐకేపీ సెంటర్ వద్ద సమావేశమై ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గన్నేరువరం మండల ఎమ్మార్వో కనకయ్య వెంటనే చీమలకుంటపల్లి ఐకేపీ సెంటర్కు చేరుకొని రైతులతో మాట్లాడారు. పై అధికారులతో చర్చించి, మరో పది రోజుల్లో కేంద్రంలో ఉన్న మొత్తం వడ్లను కొనుగోలు చేసి తరలించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
ఎమ్మార్వో హామీతో రైతులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. అయితే, పది రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని రైతులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చీమలకుంటపల్లి గ్రామ సర్పంచ్ జంగిటి ప్రకాష్, ఐకేపీ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.








