గన్నేరువరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రంగనవేణి కవిత – ఐలయ్య దంపతులకు మంజూరైన ఇంటి నిర్మాణ పనులను సర్పంచ్ లచ్చినర్సు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఇల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా లేకుండా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, గ్రామ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాన్యుల అభ్యున్నతే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు లబ్ధిదారులు కవిత, ఐలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సొంత ఇంటి కల నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు బోయిని కుమార్, వేదిరె విజేందర్, సతీష్, కాంగ్రెస్ నాయకులు న్యాత జీవన్, దేశరాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు.








