మాచర్ల : మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు కె.సి.పి సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కె.సి.పి సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ తెలిపారు.
కె.సి.పి సంస్థల చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెలగపూడి ఇందిరాదత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మారుతున్న జీవనశైలి, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో మహిళలను వివిధ రకాల వ్యాధులు వేధిస్తున్న నేపథ్యంలో క్యాన్సర్పై అవగాహన కల్పించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం లక్ష్యంగా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కె.సి.పి జనరల్ స్టోర్ పక్కన ఉన్న వెలగపూడి లక్ష్మణ దత్ ఆడిటోరియంలో ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు.
శిబిరంలో ప్రముఖ నందమూరి బసవతారకం–ఇండో అమెరికన్ క్యాన్సర్ సంస్థకు చెందిన నిపుణులైన వైద్యులు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉదరం, రొమ్ము, ఛాతీ, గర్భాశయానికి సంబంధించిన పరీక్షలు చేయడంతో పాటు క్యాన్సర్పై అవగాహన కల్పించి, అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు.
అదేవిధంగా ఖరీదైన వైద్య పరీక్షలైన ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్ స్మియర్, మెమోగ్రఫీ వంటి పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు కె.సి.పి అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఈ శిబిరాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరానికి హాజరయ్యే మహిళలు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో కె.సి.పి హెచ్ఆర్ ఉదయ్ కుమార్, వివిధ విభాగాల హెడ్లు, రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల అధ్యక్షుడు పఠాన్ నాగూర్ వలి, ట్రెజరర్ ఆవుల వెంకట వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.








