పాకాల (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి, తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి సహకరించాలని పాకాల తహసీల్దార్, చంద్రగిరి నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఓటర్లు జూలై 14లోపు తప్పనిసరిగా తమ వివరాలను సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) అందజేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మండలంలో ఇప్పటికే 92 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఓటర్లు తమకు అందిన ఫారాలను పూర్తిగా నింపి, అవసరమైన ఫోటోలు జతచేసి సంబంధిత బీఎల్ఓలకు సమర్పిస్తే, వాటిని ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేస్తారని వివరించారు.
అయితే ఫారాల పంపిణీ వేగంగా జరిగినప్పటికీ, పూర్తి చేసిన వివరాల సమర్పణలో ఓటర్లు ఇంకా వెనుకబడి ఉన్నారని తహసీల్దార్ ఆందోళన వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 6,370 మంది ఓటర్లు మాత్రమే తమ వివరాలను సమర్పించగా, ఇది మొత్తం ఓటర్లలో 14.42 శాతమేనని వెల్లడించారు. ఇంకా 37,795 మంది ఓటర్లు జూలై 14లోపు తమ వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు.
ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు శనివారం, ఆదివారం ప్రత్యేక నమోదు డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల పాటు అన్ని బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉండి, ఓటర్ల నుంచి పూర్తి చేసిన ఫారాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలపై సంబంధిత బీఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ ముద్రించి ఉండటంతో వారిని నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.
పాకాల మండలంలోని ఓటర్లందరూ ఈ ప్రత్యేక డ్రైవ్ను సద్వినియోగం చేసుకుని, తమ బీఎల్ఓలను సంప్రదించి పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలని, తద్వారా ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.








