కురుపాం నియోజకవర్గం, మే 16: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, జనసేన ఉద్యమి నిమ్మక జయరాజు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పిలుపుమేరకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిమ్మక జయరాజు మాట్లాడుతూ, పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు 12 ఏళ్ల కాలంలో జనసేన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో చేసిన కృషి ఫలితంగానే 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి విజయాన్ని సాధించి, నేడు అధికారంలో భాగస్వాములమయ్యామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలిపారు.
కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని నిమ్మక జయరాజు స్పష్టం చేశారు. జనసైనికులు, వీరమహిళలను సమన్వయం చేసుకుంటూ, అందరి సహకారంతో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.








