జియ్యమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గోర్లివలస సమీప అటవీ ప్రాంతంలో అరుదైన కందజాతి పుష్పాలు దర్శనమివ్వడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. వింత ఆకారంలో వికసించిన ఈ పువ్వులను చూసేందుకు స్థానిక రైతులు, గిరిజనులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా వెలిసిన ఈ పుష్పాలు ప్రత్యేక ఆకృతితో ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుష్పాల గురించి సమాచారం తెలుసుకున్న కొంతమంది వృక్షశాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తలు ఇవి ప్రముఖ కందజాతి అయిన ‘ఎలిఫెంట్ ఫుట్ యామ్’ వర్గానికి చెందినవిగా భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి జాతులు అటవీ ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కందజాతికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పలు పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు తెలిపారు. మార్కెట్లో కూడా ఈ జాతి కందకు మంచి డిమాండ్ ఉందని వివరించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు ఈ పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించి గిరిజన ప్రాంతాల్లో ఈ కందజాతి పంటను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసేలా చర్యలు తీసుకుంటే, గిరిజన రైతులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








