జగిత్యాల జిల్లా, కోరుట్ల: ఉత్తర తెలంగాణ ప్రజలకు శుభవార్తగా కోరుట్ల మీదుగా మరో తిరుపతి రైలు సేవ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల 07189/07190 నాందేడ్–ధర్మవరం వారాంతపు ప్రత్యేక రైలును 17635/17636 నంబర్లతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారుస్తూ అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయంతో కోరుట్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రయాణికులకు తిరుపతి వైపు ప్రత్యక్ష రైలు సౌకర్యం మరింత సులభతరం అయింది. ఇప్పటికే నాందేడ్–తిరుచానూరు వారాంతపు ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సేవగా కొనసాగుతుండగా, ఇప్పుడు మరో రైలు కూడా రెగ్యులర్ కావడంతో ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Indian Railways ప్రకటన ప్రకారం, 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 7:58 గంటలకు కోరుట్ల చేరుకుని 8:00 గంటలకు బయలుదేరి తదుపరి గమ్యస్థానాల వైపు ప్రయాణిస్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి చేరుకుని, సాయంత్రం 7:30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. తొలి సర్వీస్ 2026 మే 22న ప్రారంభం కానుంది.
తిరుగు ప్రయాణంలో 17636 ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం 5:25 గంటలకు ధర్మవరం నుంచి బయలుదేరి, ఉదయం 10:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అనంతరం సోమవారం తెల్లవారుజామున 2:03 గంటలకు కోరుట్లకు చేరుకుని 2:05 గంటలకు బయలుదేరి ఉదయం 8:05 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. తొలి సర్వీస్ 2026 మే 17న ప్రారంభం కానుంది.
ఈ రైలు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, పాకాల, మదనపల్లె రోడ్, కదిరి, ధర్మవరం వంటి ప్రధాన మార్గాల మీదుగా నడవనుంది. దీంతో ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం రాకపోకలు సాగించే ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక రైలు సేవను శాశ్వత ఎక్స్ప్రెస్గా మార్చడం ఉత్తర తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరినట్లుగా భావిస్తున్నారు.








