తిరుపతి జిల్లా, పాకాల : చంద్రగిరి నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానికు తగదని పాకాల మండల వైకాపా కన్వీనర్ నరేష్ రెడ్డి హెచ్చరించారు.
సోమవారం పాకాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యతేనని, అయితే ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన స్థాయిని తగ్గిస్తోందని ఎద్దేవా చేశారు. “అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి ప్రజల తీర్పు మారుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలనలో ఇలాంటి రాజకీయాలు జరగలేదని గుర్తు చేశారు. వైకాపా హయాంలో పాకాల మండలంలోనే రూ.117 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, దమ్ముంటే అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, ఎంపీపీ లోకనాదం, సీనియర్ నాయకులు మునిరత్నం రెడ్డి, కపిలేశ్వర్ రెడ్డి, చంటి, గిరిధర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, వనజ, గోపి తదితరులు పాల్గొన్నారు.








