అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, ప్రతి వంతెనను నాశనం చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య చర్చల కోసం ఏప్రిల్ 20న అమెరికా ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు వెళ్లనుందని వెల్లడించారు.
ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో ట్రంప్, “మేము న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ అంగీకరించకపోతే ఇరాన్లోని కీలక మౌలిక వసతులను అమెరికా ధ్వంసం చేస్తుంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరాన్ హింసాత్మక వ్యవస్థను ముగించే సమయం వచ్చిందని, గతంలో ఇతర అధ్యక్షులు చేయలేని చర్యలను తాను తీసుకుంటానని పేర్కొన్నారు.
గతంలో ఏప్రిల్ 11న ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టింది.
చర్చలు విఫలమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధి లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా నావికాదళం దిగ్బంధనం విధించగా, దానికి ప్రతిగా ఇరాన్ ఆ జలసంధిని మూసివేసింది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. ఫ్రాన్స్, బ్రిటన్కు చెందిన నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిందని పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల ఇరాన్కే రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన ఈ సమయంలో, సోమవారం జరగనున్న చర్చలపై అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.








