contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెట్స్

వాషింగ్టన్: ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి అమెరికా 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధిని అందజేస్తోందంటూ వస్తున్న వార్తలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖండించారు. అలాంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు నేరుగా ఒక్క డాలర్ కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

‘ది మెగిన్ కెల్లీ షో’లో మాట్లాడిన వాన్స్, ఒప్పందానికి సంబంధించిన అంశాలపై వివరణ ఇచ్చారు. ఇరాన్ ఒప్పందంలోని నిబంధనలను పాటిస్తూ తన ప్రవర్తనలో మార్పు తీసుకొస్తే, ఇతర దేశాలు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశమే ఉందని తెలిపారు. దీనిని అమెరికా నిధుల సహాయంగా భావించడం తప్పని అన్నారు.

“ఇరాన్‌కు డబ్బులు ఇస్తున్నారని చాలా మంది చెబుతున్నారు. కానీ వాస్తవం అది కాదు. ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఇతర దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తాం. తద్వారా ఆ దేశ ప్రజలకు కొంత ఆర్థిక ఉపశమనం, అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి” అని వాన్స్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణను ప్రస్తావించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి మిత్రదేశాలు ఇరాన్‌లోని అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని భావించినా, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షల కారణంగా అది సాధ్యం కాదన్నారు. ఇరాన్ తన వైఖరిని మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తేనే అలాంటి పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేశారు.

రాయిటర్స్ కథనంతో చర్చ

ఇటీవల అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంలో భాగంగా ఇరాన్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ ఫండ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని ఆ కథనం పేర్కొంది.

అయితే ఇది ప్రభుత్వ నిధి కాదని, పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడుల ఆధారంగా ఏర్పడే నిధి అని కూడా కథనంలో స్పష్టం చేశారు. “రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ ఫండ్” పేరుతో ఏర్పాటు కానున్న ఈ నిధిలో అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాకు చెందిన ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశముందని పేర్కొన్నారు.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆశలు

దశాబ్దాలుగా అమల్లో ఉన్న అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ విదేశీ పెట్టుబడులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సహజ వాయువు నిల్వలు, నాలుగో అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తుది శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాతే ప్రతిపాదిత నిధి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. రాబోయే 60 రోజుల్లో నిధి నిర్వాహకులు, ఇరాన్ అధికారులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కలిసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను రూపొందించే అవకాశం ఉందని సమాచారం.

ఇరాన్ ఒప్పందంలోని షరతులను పూర్తిగా పాటించి, అంతర్జాతీయ సమాజం ఆశించే విధంగా వ్యవహరిస్తేనే విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని, తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అవకాశం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :