అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో జలధార–జలహారతి పనులపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జలధార–జలహారతి కింద చేపట్టిన పనుల స్థితిగతులను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుని, పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తరువాత దిగువపల్లి, కాకతి పంచాయతీల్లో ఫీల్డ్ విజిట్ నిర్వహించిన ఆయన, అక్కడి చెరువులు మరియు నీటి సరఫరా కాలువలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నాయని రైతులు వివరించగా, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్వతి, ఎంపీడీవో లీలా మాధవి, రూరల్ సీఐ సాయి ప్రసాద్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.








