కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన ఖాతా లక్ష్మయ్య ఇంట్లో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆయన భార్య మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై నరేందర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మయ్య కనిపించినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కొత్తగట్టు శ్రీనివాస్, వేములవాడ దేవస్థానంలోని కళ్యాణకట్టులో పనిచేస్తూ ఉండగా లక్ష్మయ్యను గుర్తించాడు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా రిపోర్టర్ బుర్ర రాజ్ కోటి షేర్ చేయగా, శ్రీనివాస్ వెంటనే స్పందించి లక్ష్మయ్య గురించి వివరాలు అందించాడు. అనంతరం రాజ్ కోటి ఈ విషయాన్ని ఎస్సై నరేందర్ రెడ్డికి తెలియజేయడంతో, పోలీసులు కుటుంబ సభ్యులతో సంప్రదించి వేములవాడకు పంపించారు.
బుధవారం రాత్రి సుమారు 11:30 గంటలకు శ్రీనివాస్ వద్ద ఉన్న లక్ష్మయ్యను కుటుంబ సభ్యులు కలుసుకుని, మాట్లాడి తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. లక్ష్మయ్య సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో సహకరించిన రిపోర్టర్ రాజ్ కోటి, కొత్తగట్టు శ్రీనివాస్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్సై నరేందర్ రెడ్డి కూడా వారిని అభినందించారు.








