కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, హైదరాబాద్: సిర్పూర్ కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందనను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, కార్మికుల తరఫున బలంగా మాట్లాడే గుర్తింపు సంఘం లేకపోవడాన్ని యాజమాన్యం తమకు అనుకూలంగా మలుచుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను పరిరక్షించాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వెంటనే ఎన్నికలు నిర్వహించడం అవసరమని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మిల్లులో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.








