కరీంనగర్ జిల్లా: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్” కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో దుర్షెడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాల గురించి వివరించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, డ్రగ్స్కు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలైన యువతను మాదకద్రవ్యాల వ్యసనం నుంచి రక్షించేందుకు పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, యాంటీ నార్కోటిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ రవీందర్, ఎస్సై లక్ష్మారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.








