పెద్దపల్లి జిల్లా గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఠల్నగర్ 5 ఇంక్లైన్ ప్రాంతంలో డివిజన్ నంబర్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వార్డుల పునర్విభజన చేపట్టడంతో పాత డివిజన్ నంబర్లలో మార్పులు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పాత నంబర్లే కొనసాగుతుండటం స్థానికుల్లో అయోమయానికి దారితీస్తోంది.
గతంలో 5 ఇంక్లైన్ ప్రాంతం 33వ డివిజన్ పరిధిలో ఉండేది. అయితే ఇటీవల జరిగిన వార్డుల పునర్విభజన అనంతరం ఈ ప్రాంతాన్ని 43వ డివిజన్ పరిధిలోకి మార్చారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంటి నంబర్లతో పాటు సంబంధిత డివిజన్ నంబర్లను పేర్కొంటూ కొత్త సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అయితే, ప్రాంత ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రధాన ఆర్చి (కమాన్)పై మాత్రం ఇప్పటికీ 33వ డివిజన్ అనే పాత నంబర్ అలాగే కొనసాగుతోంది. కొత్తగా 43వ డివిజన్ నంబర్ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు, సందర్శకులు గందరగోళానికి గురవుతున్నారు.
స్థానికులు స్పందిస్తూ, అన్ని సూచిక బోర్డులను నూతన డివిజన్ నంబర్లకు అనుగుణంగా నవీకరించిన అధికారులు, ప్రధాన ఆర్చి వద్ద ఉన్న పాత డివిజన్ నంబర్ను కూడా వెంటనే మార్చాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, ప్రజల్లో అయోమయం తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








