గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సాయిని మల్లేశం గన్నేరువరం మండలంలో పర్యటించారు. తన సొంత గ్రామంలోని ఖాసీంపేట శ్రీ స్వయంభు మానసా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు సాయిని మల్లేశంను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత సొంత మండలానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాజీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పార్టీ బలోపేతానికి చేసిన కృషిని కొనసాగిస్తానని తెలిపారు. బూత్ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేస్తామని చెప్పారు.
మండలంలోని సమస్యలపై బీజేపీ ప్రజల తరఫున పోరాడుతుందని మల్లేశం అన్నారు. ముఖ్యంగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 30 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. డబుల్ రోడ్డు కోసం కేవలం నిరాహార దీక్షలు చేయడం కాకుండా, రోడ్డు నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మల్లేశం డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, కరివేద మైపాల్ రెడ్డి, జిల్లా నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, మచ్చ సాయి కృష్ణ, మునిగంటి లింగయ్య, కుర్ర హరీష్, మచ్చ బాలరాజు, గంట గౌతమ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









