గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలని యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో యువజన నాయకుడు కాల్వ నాగరాజు ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న కల్వర్టు పనులకు వెంటనే టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరారు. పనుల్లో మరింత జాప్యం జరిగితే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రోడ్డు పనులు పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం గన్నేరువరంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు నిర్మాణం కోసం తానే అమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయాన్ని యువజన నాయకులు ప్రస్తావించారు. కేవలం దీక్షల పేరుతో కాలయాపన చేయకుండా రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల పక్షాన తాము పోరాటం కొనసాగిస్తామని, అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని యువజన నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తిప్పర్తి ప్రవీణ్, గంట గౌతమ్, తెల్ల సంతోష్, గూడూరి గౌతమ్, నరేష్, రాజు, మునగంటి అంజి, కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.








