గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వరకు సాగిన ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో మహిళలు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.72 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని రసమయి బాలకిషన్ విమర్శించారు. ఎమ్మెల్యేగా 33 నెలల పాలనలో నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
గుండ్లపల్లి–గన్నేరువరం–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరించారు. రోడ్డు పనులు ప్రారంభించకపోతే రాజీవ్ రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దిష్టిబొమ్మ దహనానికి యత్నం
మహా పాదయాత్ర అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు, యువకులు రాజీవ్ రహదారిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణ రావు, మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీలు మాడుగుల రవీందర్ రెడ్డి, సిద్ధం వేణు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడేల్లి ఆంజనేయులు, మండల నాయకులు న్యాత సుధాకర్, గొల్లపల్లి రవి, కొట్టే భూమయ్య, చింతల రవి, మీసాల ప్రభాకర్, బోయిని బాలయ్య, బోయిని అంజయ్య, తోట కోటి, వరాల పార్శారం, కాంతాల విక్రమ్ రెడ్డి, తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నోముల రాజేష్ గౌడ్, మల్యాల తిరుపతి గౌడ్, గూడూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.








