దేశం లోని విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది భద్రతా విధులు, ఇతరత్రా సేవలు అందిస్తున్నారు. అయితే, భద్రతాపరమైన ఖర్చులు తగ్గించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని 60 విమానాశ్రయాల్లో ఏమంత ప్రాముఖ్యత లేని విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఇతర విమానాశ్రయాల్లో కీలక విధుల్లో నియమించాలని, వారి స్థానాలను ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో భర్తీ చేయాలని భావిస్తోంది.
ఆ 60 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్థానంలో 1,924 మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమిస్తామని ఏఏఐ వెల్లడించింది.
అంతేకాకుండా, 45 ఎయిర్ పోర్టుల్లో డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్ మెంట్ (డీజీఆర్) ప్రాయోజిత సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందిన 581 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్టు తెలిపింది. వీరంతా వైమానిక భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన మీదట ఆయా ఎయిర్ పోర్టుల్లో విధుల్లో చేరతారని వివరించింది.