కాకినాడ : శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని విజయవాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు భోగి గణపతి పీఠంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి తదితర అష్టలక్ష్మీ రూపాలకు సంబంధించిన కలశాలను నగర సంకీర్తనతో ఊరేగింపుగా తీసుకువచ్చి పీఠంలో ప్రతిష్ఠించారు.
అనంతరం పంచామృతాలతో అష్టలక్ష్మీ మాతకు అభిషేకం నిర్వహించి, సహస్రనామ పారాయణం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా మహిళలకు తాంబూలాలను అందజేశారు.
ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ ధనం, ధాన్యం, ధైర్యం, శౌర్యం, విద్య, కీర్తి, సంతానం, విజయాన్ని ప్రసాదించే అష్టలక్ష్మీ ఆరాధ్య రూపాలను పూజించడం హిందూ ధర్మంలో సనాతన సంప్రదాయమని తెలిపారు. శ్రావణ మాసంలో అష్టలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని భక్తులు కోరుకుంటారని పేర్కొన్నారు.
ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు కాగడాలతో నగర సంకీర్తన నిర్వహించనున్నట్లు రమణరాజు తెలిపారు. ఉత్సవాల చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం మహా కుంభం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.








