తూప్రాన్ (మెదక్ జిల్లా): మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అండగా నిలుస్తూ వారికి అవసరమైన అన్ని సేవలను ఒకే వేదికపై అందిస్తున్న భరోసా కేంద్రం నాలుగో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ వి. విక్రాంత్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాల బాధితులకు అండగా నిలుస్తూ కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సహాయం, పునరావాస సేవలను సమన్వయంతో అందిస్తూ ఆదర్శవంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు.
నేరం జరిగిన తర్వాత బాధితులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, భయాందోళనలను అధిగమించేలా వారికి ధైర్యం కల్పించడంతో పాటు, న్యాయం పొందే వరకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం భరోసా కేంద్రం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
బాధితుల గోప్యత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి కేసును సున్నితమైన దృక్పథంతో నిర్వహించాలని భరోసా కేంద్రం సిబ్బందికి సూచించారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా పోలీసు శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని అన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే సేవా దృక్పథంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ, బాధితులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుచరిత, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ సౌమ్య, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








