భూమి చరిత్రలో ఇప్పటివరకు గుర్తించిన అత్యంత పురాతన ఉల్కాపాతం ఆనవాళ్లను శాస్త్రవేత్తలు తాజాగా వెలికితీశారు. డైనోసార్లు భూమిపై సంచరించడానికి కోట్లాది ఏళ్ల ముందే, సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టిందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఆస్ట్రేలియాలోని పశ్చిమ ప్రాంతంలో గుర్తించడంతో శాస్త్ర ప్రపంచంలో ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియాలోని పిల్బారా ప్రాంతంలోని నార్త్ పోల్ డోమ్ను శాస్త్రవేత్తలు చాలా కాలంగా పురాతన ఉల్కాపాత కేంద్రంగా భావిస్తున్నారు. అయితే ఈ ఉల్కాపాతం ఎప్పుడు జరిగిందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయింది. తాజాగా ఆధునిక ఖనిజ విశ్లేషణ సాంకేతికతలను ఉపయోగించి నిర్వహించిన అధ్యయనం ఆ సందేహాలకు ముగింపు పలికింది.
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ‘జిర్కాన్’ అనే సూక్ష్మ ఖనిజాన్ని విశ్లేషించారు. భూమి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని కోట్లాది సంవత్సరాల పాటు భద్రపరిచే ప్రత్యేక లక్షణం జిర్కాన్కు ఉంది. నార్త్ పోల్ డోమ్ ప్రాంతంలో లభించిన జిర్కాన్ కణాల్లో అసాధారణ మార్పులు కనిపించాయి. భారీ ఉల్క భూమిని ఢీకొన్న సమయంలో ఉత్పన్నమైన అత్యంత అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఈ మార్పులు సంభవించినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్ కిర్క్లాండ్ మాట్లాడుతూ, జిర్కాన్లో నమోదైన సంకేతాలు సుమారు 300 కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఒకే భారీ ఘటనను సూచిస్తున్నాయని తెలిపారు. ఈ ఫలితాలను ధృవీకరించేందుకు పరిశోధకులు ‘అపటైట్’ అనే మరో ఖనిజాన్ని కూడా పరీక్షించారు. ఆశ్చర్యకరంగా ఆ ఖనిజం కూడా అదే కాలాన్ని సూచించడంతో పరిశోధన ఫలితాలపై శాస్త్రవేత్తలకు మరింత నమ్మకం ఏర్పడింది.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి మహా ఉల్కాపాతాలు భూమి భౌగోళిక పరిణామ క్రమంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. ఖండాల నిర్మాణం, భూమి ఉపరితల రూపాంతరాలు, ప్రారంభ భూగర్భ మార్పులపై ఇవి గణనీయమైన ప్రభావం చూపి ఉండొచ్చని వారు చెబుతున్నారు. జీవం పుట్టకముందే అంతరిక్షం నుంచి వచ్చిన ఈ భారీ విపత్తులు భూమి భవిష్యత్తు రూపురేఖలను మార్చివేసి ఉండవచ్చనే అభిప్రాయాన్ని ఈ పరిశోధన బలపరుస్తోంది.
ఈ ఆవిష్కరణతో భూమి ఆవిర్భావం, ప్రారంభ చరిత్ర, అంతరిక్ష ప్రభావాలపై మరిన్ని కొత్త అధ్యయనాలకు మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









