జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం : సమాజంలో మానవత్వం మాయమవుతోందనే ఉదాహరణగా నిలిచే ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వృద్ధులైన తల్లిదండ్రులు తనతో ఉన్నారని కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదని మంజుల అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
మంజుల తెలిపిన వివరాల ప్రకారం, తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తుంటే, ఇల్లు యజమానులు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆమె పేర్కొంది. “నువ్వు ఒక్కదానివే ఉంటే ఇల్లు ఇస్తాం, తల్లిదండ్రులు ఉంటే ఇవ్వం” అని చెప్పి తిరస్కరిస్తున్నారని ఆమె వాపోయింది.
ఈ విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో మంజుల వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే తన తల్లిదండ్రులను సముచితంగా చూసుకుంటానని ఆమె అధికారులను కోరింది.
వృద్ధుల పట్ల సమాజంలో మారుతున్న ధోరణులపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








