అనకాపల్లి జిల్లా: నిర్వహణ లోపం, అవినీతి, కాంట్రాక్టర్లు–అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల రహదారులు అధ్వాన్నంగా మారాయి. స్వల్ప వర్షానికే రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చోడవరం నియోజకవర్గ పరిధిలోని పొట్టి దొరపాలెం, బంగారు మెట్ట, మేడివాడ, గర్నికం గ్రామాలకు వెళ్లే ప్రధాన, అంతర్గత రహదారులు చిన్న వర్షానికే పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు.
వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో రహదారుల పరిస్థితి గుర్తించడం కూడా కష్టంగా మారిందని, అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేయడం, అధికారులు పర్యవేక్షణలో విఫలమవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








