అనంతపురం జిల్లా, గుత్తి : ఖరీఫ్-2026-27 సీజన్కు సంబంధించి రైతులు సాగు చేసే పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని గుత్తి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కల్పించిన పంటల బీమా సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్ ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పంట నష్టాల నుంచి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే, తక్కువ కాలవ్యవధిలో పండే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
ఖరీఫ్-2026-27 సీజన్కు ఎకరాకు నిర్ణయించిన బీమా ప్రీమియం వివరాలను ఆయన వెల్లడించారు. వాటి ప్రకారం వేరుశనగకు రూ.640, పత్తికి రూ.1,140, అరటికి రూ.3,000, కందికి రూ.80, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదానికి రూ.80 ప్రీమియంగా నిర్ణయించినట్లు తెలిపారు.
రైతులు తమ పంట వివరాలను స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్ధారించుకుని, ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)ను సంప్రదించి పంట బీమాకు దరఖాస్తు చేసుకుని నిర్ణీత ప్రీమియం చెల్లించాలని సూచించారు.
వేరుశనగ, పత్తి, అరటి పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు జూలై 15 చివరి తేదీ కాగా, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం పంటలకు జూలై 31 వరకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పంటలకు బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు.








