జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు ఆదివారం ఉదయం పగుల గొట్టారు. లోపల ఉన్న డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకుని ఈ నెల 26వ తేదీలోగా హైకోర్టుకు సమర్పించనున్నారు. తాళాలు పగులగొట్టే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు.
2018 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాలమేరకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన నూకపల్లి బీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్కు హైకోర్టు అనుమతినిచ్చింది. తాళాలు తీసిన తర్వాత స్ట్రాంగ్ రూంలోని ఫైళ్లు, ఈవీఎంలు తరలించేందుకు రిటర్నింగ్ అధికారి అడిగిన వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతను కల్పించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.