contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైద్యారోగ్య రంగంలో మరిన్ని స్వచ్ఛంద సంస్థలు రావాలి: సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన Basavatarakam Indo American Cancer Hospital & Research Institute  రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, ఆస్పత్రి 25 ఏళ్ల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవతారకం ఆస్పత్రి ఆవిర్భావం వెనుక ఉన్న భావోద్వేగ నేపథ్యాన్ని గుర్తు చేశారు. తమ అత్తగారు బసవతారకం క్యాన్సర్ బారిన పడిన సమయంలో రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ముంబై, చెన్నై వంటి నగరాలపై ఆధారపడాల్సి వచ్చేదని తెలిపారు. అయితే ఆగస్టు సంక్షోభ సమయంలోనే ఆమె మరణించారని, అలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే సంకల్పంతో ఈ ఆస్పత్రి ఏర్పాటైందని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి N. T. Rama Rao  దార్శనికత, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. మాజీ స్పీకర్  కోడెల శివప్రసాద్, ప్రముఖ వైద్య నిపుణుడు  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తదితరుల సహకారంతో ఆస్పత్రి ప్రస్థానం మొదలైందన్నారు.

ప్రారంభంలో 100 పడకలతో మొదలైన ఆస్పత్రి నేడు 650 పడకల సామర్థ్యంతో దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ క్యాన్సర్ వైద్య సంస్థగా ఎదిగిందని సీఎం పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే క్యాన్సర్ బాధితులకు ఈ ఆస్పత్రి ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. ఏడాదికి మూడు లక్షల మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తూ, రోజుకు సగటున 22 శస్త్రచికిత్సలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే Nandamuri Balakrishna  సేవలను ప్రత్యేకంగా అభినందించారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రోగులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. అమరావతిలో వెయ్యి పడకల సామర్థ్యంతో మరో ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని వైద్య సంస్థగా బసవతారకం ఆస్పత్రి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రజా సేవకు అంకితమైన కుటుంబం

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రివెంటివ్, క్యూరేటివ్, ప్రిడిక్టివ్ వైద్య విధానాలను అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తేనే పేదలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ అవుతుందని చెప్పారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ఆయన స్థాపించిన పార్టీ రాజకీయంగా సేవలు అందిస్తుండగా, ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారని అన్నారు. బాలకృష్ణ తన తల్లి పేరుతో బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తుండగా,  నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య సేవలను అందిస్తూ తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజా సేవలో ఈ కుటుంబం చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు  అనుప్రియా పటేల్,  పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ, తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రులు సత్యకుమార్ యాదవ్,  దామోదర రాజనరసింహ, ఎంపీలు  దగ్గుబాటి పురందేశ్వరి,  భరత్, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :