తిరుపతి : ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-1861లోని సెక్షన్-30 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు.
తిరుపతి, తిరుమల ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జూన్ 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. ఈ కాలంలో తిరుపతి జిల్లా పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారుల అనుమతితో పాటు సంబంధిత సబ్-డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్డీపీఓ) కార్యాలయం నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ప్రజా రహదారులు, కూడళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఒకేసారి వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే వివాహాలు, అంత్యక్రియలు, సంప్రదాయ కుటుంబ కార్యక్రమాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.
పోలీస్ యాక్ట్-1861 సెక్షన్-30 నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించిన అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల ప్రతినిధులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి జిల్లా శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.








