హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లుండగా, పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు కొత్తగా స్థానం కల్పించి, 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్టు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు.
ఓటర్ల పేర్లు తొలగింపుపై, ఇతర అంశాలపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా, ప్రతి వారం రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను సీఈవో ఆదేశించారు.