దోహా : ఖతార్లోని ప్రముఖ ఇంధన ఉత్పాదక కేంద్రం రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 12 మంది భారతీయులు, మరొకరు పాకిస్థాన్కు చెందిన కార్మికుడిగా అధికారులు ధ్రువీకరించారు. పేలుడు తీవ్రతకు మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఈ దుర్ఘటనపై ఖతార్ ఇంధన శాఖ సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ సీఈవో సాద్ అల్-కాబీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయని, అనంతరం చేపట్టిన మరమ్మతుల తర్వాత ప్లాంట్ను తిరిగి ప్రారంభించే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. అయితే ఇది ఎలాంటి విద్రోహ చర్య, ఉగ్రదాడి లేదా శత్రుదేశాల దాడి కాదని, పూర్తిగా సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగినప్పటికీ ఖతార్ అంతర్జాతీయ ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతులపై ఎలాంటి ప్రభావం లేదని, పర్యావరణానికి కూడా ఎటువంటి ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఇక ఈ ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. మృతిచెందిన భారతీయుల వివరాలను సేకరించి వారి కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియను ప్రారంభించింది. గాయపడిన భారతీయ కార్మికులందరికీ స్థానిక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
బాధిత కుటుంబాలకు అవసరమైన చట్టపరమైన సహాయం అందించడంతో పాటు, మృతుల భౌతిక కాయాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఖతార్ ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో ఖతార్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడంతో పాటు ప్రమాదానికి దారితీసిన కారణాలపై పారదర్శక విచారణ జరపాలని భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








