కరీంనగర్, జూన్ 3: గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. కథనంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలతపై సస్పెన్షన్ వేటు వేశారు.
Karimnagar : ఉపాధి హామీ కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ సొంత పనులు..! వెలుగులోకి అక్రమాలు
ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్థులు, కూలీలు చేసిన ఫిర్యాదులతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) ఎం. గీత శ్రీలతను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణలో దుబాయ్లో ఉన్న వ్యక్తికి గ్రామంలో పని చేసినట్లు నకిలీ మస్టర్లు నమోదు చేసి ఉపాధి హామీ నిధులు మంజూరు చేసిన విషయం బయటపడింది. అలాగే ఉపాధి కూలీలను వ్యక్తిగత వ్యవసాయ, గృహ పనులకు వినియోగించి వారికి ప్రభుత్వ నిధుల నుంచి వేతనాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా నకిలీ జాబ్ కార్డుల వినియోగం, పని చేయని వ్యక్తుల పేర్లతో హాజరు నమోదు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా జాబ్ కార్డుల నిర్వహణ వంటి అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది.
ఈ నేపథ్యంలో శ్రీలతపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంతో పాటు దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించి అధికారులు చర్యలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై ఇదే తరహా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.








