ఆంధ్రప్రదేశ్ – గుంటూరు జిల్లా : రాజకీయ కక్షలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎదుటి పార్టీ వారిని సహించలేని తత్వం దాదాపు అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి, ఇతర పార్టీల కార్యకర్తల మధ్య అనేక ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఘటన జరిగింది.
శావల్యాపురం మండలం కారుమంచిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాల వారిలో కొందరు గాయపడ్డారు. ఇటీవల కారుమంచిలో తిరునాళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా ఆ వివాదం ముదిరి, ఘర్షణకు దారి తీసింది.
ఈ ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.