కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు పైబడి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుని,
బూస్టర్ డోసు తీసుకోని వారందరికీ ఈనెల 24 నుండి బూస్టర్ డోస్ (కార్బియక్స్ వ్యాక్సిన్) ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నాలుగు కేంద్రాలలో బూస్టర్ డోస్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జహీరాబాద్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సంగారెడ్డి మార్క్స్ నగర్ లోని యు పి హెచ్ సి, పటాన్చెరు, నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రులలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 3:00 గంటల వరకు బూస్టర్ డోస్ ఇస్తారని ఆయన తెలిపారు. గతంలో రెండు డోసులు తీసుకుని బూస్టర్ డోసు తీసుకోని వారందరూ బూస్టర్ డోసుకు అర్హులని తెలిపారు. కోవ్యాక్సిన్, కోవి షీల్డ్, తీసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ గా కార్బియక్స్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో బూస్టర్ డోసు తీసుకోని వారందరూ విధిగా బూస్టర్ డోస్ తీసుకుని కరోనా వ్యాప్తి నివారించడానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.