- ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ‘స్టాటిక్ ఫోర్స్’తో పటిష్ట భద్రత
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు
- విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా వాతావరణం
కరీంనగర్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో, కరీంనగర్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘాను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ, పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఒక నిరంతర నిఘా ఉంచేందుకు ‘స్టాటిక్ ఫోర్స్’ను (Static Force) కేటాయించామని, పరీక్ష ముగిసే వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో పోలీసు శాఖ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
పరీక్షా విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇతర పోలీసు అధికారులు మరియు విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.









