కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వేంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ ఈర్త సత్యంపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార బలంతో పేదల భూములు, ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్నారని బాధితుడు వేట్టి పరశురాం ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం వేంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పరశురాం మాట్లాడుతూ, తన తాత ‘శుకు’కు చెందిన ఇంటి స్థలాన్ని మాజీ ఎంపీపీ ఈర్త సత్యం (సత్యనారాయణ) అక్రమంగా కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాత మరణానంతరం ఆ స్థలం తమ కుటుంబానికి చెందాల్సి ఉండగా, కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఆ స్థలాన్ని అమ్మలేదని స్పష్టం చేశారు.
తహసీల్దార్ కార్యాలయం, పంచాయతీ శాఖలలో సరైన పత్రాలు చూపించకుండా అధికార ప్రభావంతో బెదిరింపులకు పాల్పడి, ఆ స్థలంలో సత్యం నిర్మాణ పనులు చేపడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా, సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్లో ఈర్త సత్యంపై FIR No: 83/2026, 176/2023, 141/2019 కింద పలు కేసులు నమోదైనప్పటికీ, వాటిని పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
ఇదే కాకుండా గ్రామంలో మరికొందరి భూములను కూడా కబ్జా చేశాడని పరశురాం తెలిపారు. ఎర్రకుంట ఇరిగేషన్ కట్ట తూమును ఆక్రమించి విక్రయాలు జరిపినట్లు ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఇళ్లు, స్థలాలను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని పేర్కొన్నారు.
గతంలో ఈ అక్రమాలను ప్రశ్నించిన పంచాయతీ మహిళా కార్యదర్శిని సైతం బెదిరించడంతో, ఆమె ఫిర్యాదు మేరకు కూడా సత్యంపై ఎఫ్ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. అధికార బలంతో గ్రామస్తులు, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ భూకబ్జాలకు పాల్పడటం ఈర్త సత్యానికి అలవాటుగా మారిందని ఆరోపించారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు శాఖ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, తమ తాతల నాటి స్థలాన్ని తిరిగి అప్పగించాలని పరశురాం వేడుకున్నారు.








