కరీంనగర్, జూన్ 2: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో 13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్స్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు.
అదేవిధంగా కమిషనరేట్ పరిపాలన కార్యాలయం (సీపీఓ) వద్ద అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. పతాకావిష్కరణ అనంతరం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు కరీంనగర్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజల రక్షణే తమ ప్రధాన బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ విభాగం అధికారులు, ఆర్ఐలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








