హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సమక్షంలోనే నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై మొదలైన ఈ వివాదం క్షణాల్లోనే తోపులాటకు దారితీసింది.
సమావేశంలో అజారుద్దీన్ పక్కన కూర్చోవడంపై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉస్మాన్ అల్ హజ్రీ ఫిరోజ్ ఖాన్ను నెట్టివేయడంతో ఆయన కిందపడిపోయారు. అక్కడే ఉన్న నాయకులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ముందుకు వచ్చారు. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఇతర నేతలు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఈ పరిణామాలతో అసహనానికి గురైన అజారుద్దీన్ సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ముగిసినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై స్పందించిన ఫిరోజ్ ఖాన్, కుర్చీ విషయంలో జరిగిన చిన్న అపార్థమే గొడవకు కారణమని తెలిపారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ భావించారని చెప్పారు. ఉస్మాన్ తనకు పెద్దన్నలాంటివాడని, ఇది తమ కుటుంబ విషయమేనని పేర్కొంటూ వివాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారు.








